భీమేశ్వరుని తెప్పోత్సవం
ABN , First Publish Date - 2021-03-01T06:11:18+05:30 IST
ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి భీమేశ్వరస్వామివారి తెప్పోత్సవం సప్తగోదావరి నదిలో మనోహరంగా జరిగింది.
ద్రాక్షారామ, ఫిబ్రవరి 28: ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి భీమేశ్వరస్వామివారి తెప్పోత్సవం సప్తగోదావరి నదిలో మనోహరంగా జరిగింది. రాత్రి 8.05 కల్యాణమూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివార్లను మంగళ వాయిద్యాల నడుమ సప్తగోదావరిలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకృతమైన హంస వాహనం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కల్యాణమూర్తులను హంస వాహనంపై కల్యాణ బ్రహ్మలు అధిష్ఠింపజేశారు. వేద పండితులు బులుసు రామకృష్ణ బృందం ముందుగా స్వామివారికి ఆస్థాన పూజ చేశారు. అనంతరం కల్యాణమూర్తులకు నీరాజన మంత్ర పుష్పాలు సమర్పిస్తుండగా మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారు సప్తగోదావరి నదిలో జలవిహారం చేశారు. భీమేశ్వరుని జలవిహారాన్ని సప్తగోదావరి ఒడ్డుకు చేరుకున్న భక్తులు తన్మయత్వంతో తిలకించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ కేఎన్వీడీవీ ప్రసాద్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.