ఈ కష్టం ఏ తల్లికీ రాకూడదు: వంచించిన యజమాని, పట్టించుకోని పోలీసులు... ఫలితంగా...
ABN , First Publish Date - 2021-09-15T11:49:52+05:30 IST
రాజస్థాన్లోని భీల్వాడాలో హృదయాలను కలచివేసే...
భీల్వాడా: రాజస్థాన్లోని భీల్వాడాలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కూలీనాలీ చేసుకుంటూ పొట్టపోషించుకునే ఒక తల్లికి కూలీ డబ్బులు అందకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని వైద్యులకు చూపించలేకపోయింది. ఫలితంగా ఆ బాలుడు తల్లి ఒడిలోనే కన్నుమూశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాలీ జిల్లాలోని జొజావర్ ప్రాంతానికి చెందిన ఆశా రావత్... అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల కుమారుడిని తీసుకుని భీల్వాడా జిల్లాలోని బద్నౌర్కు వచ్చింది. ఆశా... గుజరాత్ లోని జామ్నగర్లో నూతులు తవ్వే కంట్రాక్టర్ భన్వర్ సింగ్ దగ్గర కూలి పనులు చేస్తుంటుంది.
భన్వర్ సింగ్... బద్నౌర్ సమీపంలోని మోగర్ గ్రామంలో నివసిస్తుంటాడు. ఆశా... తన కుమారునికి అనారోగ్యం వాటిల్లడంతో తన యజమాని భన్వర్ సింగ్కు ఫోను చేసి, కూలీ డబ్బులు అడిగింది. దీంతో అతను తన గ్రామమైన మోగర్కు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఆమె రూ. 300 అప్పుతీసుకుని, తన కుమారుడిని వెంటేసుకుని మోగర్కు వచ్చింది. అయితే యజమాని ఆమెకు కూలీ డబ్బులు ఇవ్వలేదు. ఇంతలో వైద్యం అందకుండానే ఒడిలోనే ఆమె కుమారుడు కన్నుమూశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు దీనిని పట్టించుకోకపోవడంతో స్థానికులే చందాల రూపంలో మూడు వేల రూపాయలు సేకరించి ఆమెను, ఆమె కుమారుని మృతదేహాన్ని ఒక ప్రైవేటు వాహనంలో ఆమె ఉంటున్న పాలీ ప్రాంతానికి తరలించారు.