బిగ్ బ్రేకింగ్ : YSRTP కి బిగ్ షాక్.. ఇందిరా శోభన్ రాజీనామా
ABN , First Publish Date - 2021-08-20T14:42:43+05:30 IST
వైఎస్ఆర్టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ రాసుకొచ్చారు.
ఏడాది కూడా గడవక మునుపే..
అయితే.. ఇప్పటికే ఒకరిద్దరు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కీలక నేత అయినటువంటి ఇందిరాశోభన్ కూడా గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంతకు మునుపే ఆమె రాజీనామా చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ పెద్దగా ఆమె క్లారిటీ ఇచ్చుకోలేదు. ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చిన తర్వాత ఆమె మళ్లీ కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆమె పార్టీలో చేరినప్పట్నుంచి వైఎస్ఆర్టీపీ తరఫున పెట్టే మీటింగ్స్, సభలకు.. డిబేట్స్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాదు.. పార్టీ ఆవిర్భావం రోజున ఇందిరాశోభన్ స్పీచ్ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపింది. అయితే పార్టీలో చేరి పట్టుమని ఏడాది కూడా గడవక మునుపే ఇలా రాజీనామా చేసేయడం గమనార్హం.
కీలక నిర్ణయం తీసుకున్నా..!
‘నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
షర్మిలక్క పార్టీలో ఉండకూడదని..
‘రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను’ అని కీలక నేత తన ప్రకటనలో వెల్లడించారు.
రాజీనామా తర్వాత..!
‘భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములు’ అని ఇందిరాశోభన్ ప్రకటనలో తెలిపారు.