అదుపు తప్పిన బైక్.. విద్యార్థి దుర్మరణం

ABN , First Publish Date - 2021-03-22T13:38:55+05:30 IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో

అదుపు తప్పిన బైక్.. విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్/ఘట్‌కేసర్‌ రూరల్‌ : ద్విచక్రవాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి యంనంపేట్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ ఎన్‌.చంద్రబాబు చెప్పిన వివరాల ప్రకారం.. జగిత్యాల్‌ జిల్లా మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన జంగ గంగస్వామి కుమారుడు జంగ రామ్‌(22) పోచారం మునిసిపాలిటీ సింగపూర్‌టౌన్‌షిప్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 


అదే కళాశాలలో బీ-టెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న గొర్రె మహేష్‌తో కలిసి తన ద్విచ్రవాహనం (టీఎస్‌ 09 ఎఫ్‌క్యూ 5208)పై శనివారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు రాంపల్లికి వెళ్లారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరిగి హాస్టల్‌కు వస్తుండగా యంనంపేట్‌ వంతెనపై ద్విచక్రవాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై పడటంతో రామ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనకాల కూర్చున్న మహేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-03-22T13:38:55+05:30 IST