బైకు ఢీకొని.. ఎగిరిపడ్డ కారు.. ఏంటిదని షాకయ్యారా..!

ABN , First Publish Date - 2022-05-31T06:43:56+05:30 IST

బైకు ఢీకొని.. ఎగిరిపడ్డ కారు.. ఏంటిదని షాకయ్యారా..!

బైకు ఢీకొని.. ఎగిరిపడ్డ కారు.. ఏంటిదని షాకయ్యారా..!
FILE PHOTO

  • అట్లని మా ఆయనపై కేసు పెట్టారు సార్‌
  • న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించిన మహిళ


‘సార్‌.. నా భర్త బైకు మీద వెళుతుంటే ఓ కారు ఢీకొట్టింది. మా ఆయనకు కాలు, చెయ్యి విరిగింది. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కట్టలేదు. పైగా బైకు ఢీకొట్టినందుకు కారు ఎగిరి పడిందని మా ఆయనపైనే కేసు కట్టారు. మీరే న్యాయం చేయాలి’ అని ఓ మహిళ ఎస్పీ ఫక్కీరప్పను వేడుకున్నారు. కారు ఢీకొంటే బైకు ఎగిరిపడాలిగాని, కారు ఎగిరిపడటం ఏమిటి..? అనుకోకండి..! అప్పుడుప్పుడు ఇట్ల జరగొచ్చు.


అసలేం జరిగిందంటే..!

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. మొత్తం 77 మంది బాధితులు వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. వీరిలో రాయదుర్గం పట్టణానికి చెందిన చిట్టెమ్మ ఒకరు. మార్చి 3న తన భర్త అనిల్‌ కుమార్‌ బైక్‌పై వెళుతుండగా కళ్యాణదుర్గం మండలం ఉల్లికల్లు వద్ద కారు ఢీ కొందని, ఈ ప్రమాదంలో తన భర్తకు కాలు, చెయ్యి విరిగిందని ఆమె ఎస్పీకి తెలిపారు. ఈ ప్రమాదంలో తన భర్త తప్పు లేదని, కారు రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీ కొందని అన్నారు.


కారులో గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్‌ ఉన్నారని, దీనిపై కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఎస్‌ఐ సుధాకర్‌ కేసు కట్టలేదని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పైగా, ఎస్‌ఐ తిప్పేనాయక్‌ తన కారు డ్రైవర్‌ పేరిట తన భర్త అజాగ్రత్తగా బైక్‌ నడిపినట్లు, బైకు ఢీకొట్టడంతో కారు ఎగిరి గుంతలో పడినట్లు ఫిర్యాదు చేయించారని, ఈ మేరకు తన భర్తపై కేసు కట్టారని బాధితురాలు వాపోయారు. దీనిపై విచారించి, తమకు న్యాయం చేయాలని ఆమె ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులను కలిసి తన ఆవేదన చెప్పుకుని, కన్నీటి పర్యంతమయ్యారు.  - అనంతపురం క్రైం. 

Updated Date - 2022-05-31T06:43:56+05:30 IST