‘బయోలాజికల్-ఈ’కి రూ.375 కోట్లు
ABN , First Publish Date - 2021-10-24T08:45:42+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ‘బయోలాజికల్-ఈ’ నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవల్పమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎ్ఫసీ)తో
- కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు డీఎ్ఫసీ అండ
- రేపు హైదరాబాద్లో ఒప్పందం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ‘బయోలాజికల్-ఈ’ నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవల్పమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎ్ఫసీ)తో ఒప్పందం కుదుర్చుకుంటోంది. 5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.375 కోట్లు) ఆర్థిక ఒప్పందంపై సోమవారం హైదరాబాద్లో బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల, డీఎ్ఫసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ మార్చిక్ సంతకాలు చేయనున్నారు. ఈ ఆర్థిక సాయంపై ఈ ఏడాది మార్చిలో క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ప్రకటన చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. స్వల్పకాలానికి కొవిడ్ను కట్టడి చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. అంతేకాక దీర్థకాలంలో భారత్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొవిడ్ వంటి మహమ్మారులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలోని ఉన్నతాధికారి ప్యాట్రిసియా లాసినా, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్, భారత విదేశీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి వాణి రావు, జపాన్ కాన్సుల్ జనరల్ తాగా మసయుకీ, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా కిర్లీ హాజరవుతున్నారు.