పుట్టిన రోజు దైవదర్శనానికి వెళ్తుండగా.. మృత్యు ఒడికి!
ABN , First Publish Date - 2020-11-18T13:55:51+05:30 IST
ఫ్లై ఓవర్పై వేగంగా వస్తున్న కారు రెండు బైక్లను ఢీకొట్టడంతో
- దైవదర్శనానికి వెళ్తుండగా బైక్ను ఢీకొట్టిన కారు
- ఒకరి దుర్మరణం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్/కొత్తపేట : ఎల్బీనగర్ ఫ్లై ఓవర్పై వేగంగా వస్తున్న కారు రెండు బైక్లను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ముగ్గురు గాయపడ్డారు. బాలానగర్ ఫతేనగర్ శివశంకర్నగర్కు చెందిన దుర్గం నరేష్కుమార్ వ్యాపారి. అతడి ఇంట్లోనే సోదరి బొల్లేపల్లి లక్ష్మి, ఆమె కుమారుడు ఉదయ్రాజ్(18) ఉంటున్నారు. మంగళవారం ఉదయ్రాజ్ పుట్టిన రోజు కావడంతో నరేష్కుమార్ కుమార్తె దుర్గం అనూష(20)తో కలిసి బైక్పై సంఘీ టెంపుల్కు దర్శనానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ ఫ్లై ఓవర్పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు వారి బైక్ను ఢీకొట్టింది. ఉదయ్రాజ్ ఫ్లై ఓవర్పై నుంచి కింద పడ్డాడు. అతడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అనూష తల, చేతులకు గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆరెంజ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఉదయ్రాజ్ మృతి చెందాడని నిర్ధారించారు.
కారు మరో బైక్ను ఢీకొట్టడంతో సైదాబాద్ మధురానగర్కు చెందిన లింగానాయక్ కుమార్తె సాయిప్రియ(20), బిత్యా కుమారుడు బానోత్ నగేష్(17) గాయపడ్డారు. వీరు మెడిసిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నరేష్కుమార్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.