జీసస్ జన్మభూమిలో..

ABN , First Publish Date - 2020-12-23T19:24:44+05:30 IST

క్రైస్తవులకు పవిత్ర పుణ్యక్షేత్రాలయిన బెత్లహెమ్, జెరూసలెంలోని రెండు పురాతన చర్చ్ ల ప్రధాన ద్వారాల తాళం చెవులు శతాబ్దాలుగా రెండు ముస్లిం కుటుంబాల చేతిలో ఉన్నాయి. ప్రతి ఉదయమూ చర్చ్ తాళం తీయడం, సాయంత్రం తాళం వేయడం ఈ కుటుంబాల కర్తవ్యం.

జీసస్ జన్మభూమిలో..

క్రైస్తవులకు పవిత్ర పుణ్యక్షేత్రాలయిన బెత్లహెమ్, జెరూసలెంలోని రెండు పురాతన చర్చ్ ల ప్రధాన ద్వారాల తాళం చెవులు శతాబ్దాలుగా రెండు ముస్లిం కుటుంబాల చేతిలో ఉన్నాయి. ప్రతి ఉదయమూ చర్చ్ తాళం తీయడం, సాయంత్రం తాళం వేయడం ఈ కుటుంబాల కర్తవ్యం. ఈ రెండు చర్చ్ ల ఆధ్యాత్మిక సేవలను వంతుల వారీగా వివిధ క్రైస్తవ మత శాఖల  వారు నిర్వహిస్తుంటారు. 


మానవాళి అనుసరిస్తున్న మూడు మహోన్నత మతాలు- జుడా యిజం, క్రైస్తవం, ఇస్లాం ప్రభవించిన పవిత్ర గడ్డ మధ్య ప్రాచ్యం. అపార ‘ద్రవ బంగారం’ నిక్షేపాలు ప్రసాదిస్తున్న భాగ్యరాశులతో తులతూగుతున్న ఈ ప్రాంత దేశాలు వర్తమాన యుగంలో ఉద్రిక్తతలు, యుద్ధాలకు నిరంతర ఉనికిపట్టు కావడం ఒక చారిత్రక విషాదం. 


ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఆచరించే ధర్మం క్రైస్తవం. సకల దేశాలలోని క్రైస్తవులు సంతోషం, ఉత్సాహం, భక్తి ప్రపత్తులతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. అయితే ఏసుక్రీస్తు ప్రభువు జన్మించిన ప్రాంతంలో మాత్రం క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఉన్న బెత్లహెమ్‌లో రెండువేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు జన్మించాడని, ఆ పుణ్యభూమి నుంచే క్రైస్తవమతం వ్యాప్తి ప్రారంభమైందని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. ఆ మహాత్ముడు జన్మించిన ప్రదేశాన్ని, ఏసుక్రీస్తు జన్మస్థానంగా భావించే నేటివిటీ చర్చిని నిత్యం ప్రపంచం నలుమూలల నుంచీ క్రైస్తవులు, ఇతర ఆధ్యాత్మిక పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఏసుక్రీస్తు బాల్యం నుంచి మరణం వరకు గడిపిన ప్రాంతమంతా నేడు పాలస్తీనా- ఇజ్రాయెల్ వివాదంలో మగ్గుతూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇది ఒక బాధాకరమైన విషయం. యునెస్కో కృషి ఫలితంగా మాత్రమే పురాతన నేటివిటీ చర్చికి మరమ్మత్తులు నిర్వహించారు. క్రైస్తవుల పుణ్య క్షేత్రమైన బెత్లహెమ్ లోని ఏసు జన్మస్థానం నుంచి జెరూసలెంలోని శిలువయాగం వరకు ఉన్న రహదారిని ‘స్టార్ స్ట్రీట్’ అంటారు. బెత్లహెమ్ పట్టణం పాలస్తీనా పరిపాలనలో ఉండగా ఆ పట్టణ సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంటాయి! యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్ర నగరమైన జెరూసలెంలోని తూర్పుప్రాంతం 1967 నుంచి ఇజ్రాయేల్ అక్రమణలో ఉంది. జెరూసలెం లోని హోలీ సెవల్చర్ చర్చి నుంచి బెత్లహేమ్ లోని నేటివిటీ చర్చి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ రెండిటి మధ్య ఒక రక్షణ గోడను నిర్మించడంతో పాటు ఒక సైనిక చెక్‌పోస్ట్‌ను కూడా ఇజ్రాయేల్ నిర్వహిస్తోంది. 


బెత్లహేమ్, జెరూసలెం చర్చిలను సందర్శించడానికి ప్రపంచంలోని ఎక్కడెక్కడి క్రైస్తవులకు ఇజ్రాయేల్ వీసాలు జారీ చేస్తోంది. కానీ తమ దేశంలోని క్రైస్తవులకు అనుమతినివ్వడంలో మాత్రం ఉదారంగా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఆ చర్చిలను సందర్శించేందుకు 700 మంది ఇజ్రాయేలీ క్రైస్తవులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా బహిరంగ ఉత్సవాలను రద్దు చేసి కేవలం 50 మందితో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. క్రైస్తవ మత పవిత్ర ఆరాధనా మందిరాలు అయిన బెత్లహెమ్, జెరూసలెం చర్చిల ప్రధాన ద్వారాల తాళంచెవులు శతాబ్దాలుగా రెండు వేర్వేరు ముస్లిం కుటుంబాల చేతిలో ఉన్నాయి. ప్రతి ఉదయమూ వచ్చి చర్చి తాళం తీయడం, సాయంత్రం తాళం వేయడం ఈ కుటుంబాల కర్తవ్యం. ఈ రెండు చర్చిలలోనూ ఆధ్యాత్మిక సేవలను వంతులవారీగా ఆరు క్రైస్తవ మతశాఖలవారు నిర్వహిస్తుండడం మరొక విశేషం.

-మొహమ్మద్ ఇర్ఫాన్ (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2020-12-23T19:24:44+05:30 IST