BJPకి 15 స్థానాలు ఖాయం
ABN , First Publish Date - 2021-11-25T17:52:56+05:30 IST
స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్లోని 25 స్ధానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ 15కు పైగా స్ధానాలను కైవశం చేసుకోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప జోస్యం చెప్పారు.
బెంగళూరు: స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్లోని 25 స్ధానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ 15కు పైగా స్ధానాలను కైవశం చేసుకోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప జోస్యం చెప్పారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తోందని ఇందులో 15 స్థానాలను సు నాయాసంగా గెలుస్తుందన్నారు. అదృష్టం కలిసి వస్తే అదనంగా మరో రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు జరుగుతున్న 25 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఐదేనని ఈసారి అదనంగా మరో 10 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వచ్చి చేరబోతున్నాయన్నారు. శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో పార్టీ అభ్యర్ధుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బుధ వారం ఆయన బయల్దేరి వెళ్ళారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ మ్యాచ్ఫిక్సింగ్ కుదుర్చుకుందని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ 20 చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దింపగా జేడీఎస్ కేవలం 7 చోట్ల మాత్రమే పోటీచేస్తుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. ఓటర్లు విజ్ఞులని ఇలాంటి ఎత్తుగడలను తిప్పికొడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు ఎలాంటి జోస్యాలు చెప్పినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించడం ఖాయమన్నారు.