రాహుల్ గాంధీని WHO డేటాతో ముడిపెట్టి బీజేపీ ఎద్దేవా

ABN , First Publish Date - 2022-05-06T22:19:20+05:30 IST

కోవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలపై ప్రపంచ ఆరోగ్య

రాహుల్ గాంధీని WHO డేటాతో ముడిపెట్టి బీజేపీ ఎద్దేవా

న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తున్నదంతా అవాస్తవమని బీజేపీ పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ బేటా (కుమారుడు), డబ్ల్యూహెచ్ఓ డేటా తప్పుడువని తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత దేశంలో సంభవించిన మరణాల సంఖ్యను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుసరించిన పద్ధతి లోపభూయిష్టమైనదని, ఊహాజనితమైనదని ఆరోపించారు. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓకు భారత ప్రభుత్వం తెలియజేసిందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీర్తి, ప్రతిష్ఠలను తగ్గించాలని రాహుల్ గాంధీ 2014 నుంచి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రక్రియలో ఆయన భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో జనన, మరణాలను నమోదు చేసే యంత్రాంగం చాలా పటిష్టంగా ఉందన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ‘‘డబ్ల్యూహెచ్ఓ డేటా, కాంగ్రెస్ బేటా... తప్పు’’ అన్నారు. మోదీ నాయకత్వంలో ఈ మహమ్మారిపై పోరాడిన తీరు ఇతర దేశాలకు మార్గదర్శకమని ప్రపంచం విశ్వసిస్తోందని చెప్పారు. మరణాల సంఖ్యపై రాజకీయాలు చేయడం అత్యంత విచారకరమని చెప్పారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సమర్థవంతంగా భారత దేశం ఈ మహమ్మారిపై పోరాడిందన్నారు. 


ఇటీవల డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో భారత దేశంలో కోవిడ్ కారణంగా దాదాపు 47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీనిని చూపుతూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సైన్స్ అబద్ధం చెప్పదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ఆత్మీయులను కోల్పోయినవారికి ప్రభుత్వం సహాయం అందించాలని, ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 


Read more