BJP: రాష్ట్రానికి ఇక నెలకో అగ్రనేత

ABN , First Publish Date - 2022-09-03T17:12:41+05:30 IST

శాసనసభ ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉండడంతో రాష్ట్రంపై బీజేపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై నెలకోసారి అగ్రనేతలు

BJP: రాష్ట్రానికి ఇక నెలకో అగ్రనేత

- ఎన్నికల కోసం బీజేపీ వ్యూహం

- 8న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక


బెంగళూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉండడంతో రాష్ట్రంపై బీజేపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై నెలకోసారి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యక్రమాలను రూపొందించాలని నిర్ణయించారు. 2023 ప్రారంభంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిన బీజేపీకి పట్టు కలిగిన ఏకైక రాష్ట్రం కావడంతో ఇక్కడ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రతిసారి అగ్రనేతలు రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు భారీ ప్రాజెక్టులు ప్రకటించడం, బహిరంగసభల ద్వారా ప్రజలకు దగ్గర కావాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా దినోత్సవంలో ప ల్గొనేందుకు మైసూరుకు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరుకు సబర్బన్‌ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. తాజాగా శుక్రవారం మంగళూరు పర్యటనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు బహిరంగసభ ద్వారా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. ఆగస్టు 4న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షా బెంగళూరుకు వచ్చారు. చిత్రదుర్గలో సహకార సదస్సులో పాల్గొన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Chief Minister Yogi Adityanath) బెంగళూరుకు వచ్చారు. ధర్మస్థళ సంస్థ నిర్వహిస్తున్న ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. ఇదే సందర్భంలోనే రాష్ట్ర నేతలతో రాజకీయ పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఈనెల 8న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరుకు రానున్నారు. దొడ్డబళ్లాపురలో నిర్వహించే బీజేపీ జనోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇలా వరుసగా అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలను ఇటు రాష్ట్ర పార్టీ, అటు జాతీయ నేతల పర్యటనలను రూపొందిస్తున్నారు. ఇదే విషయమై మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) సన్నిహితులతో మాట్లాడుతూ తరచూ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనలో పాల్గొంటే సమస్యల పరిష్కారంతోపాటు ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-03T17:12:41+05:30 IST