పూరిగుడిసే నివాసం... కూలి పనులే ఆధారం... బెంగాల్ ఎన్నికల్లో సత్తా చాటిన చందనా బౌరీ!
ABN , First Publish Date - 2021-05-03T15:11:09+05:30 IST
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో...
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయ్యింది. అయితే బీజేపీకి చెందిన ఒక మహిళా అభ్యర్ధి విజయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ టిక్కెట్పై సాల్తోరా సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చందనా బౌరీ.... టీఎంసీ అభ్యర్థి సంతోష్ మండల్ను ఓడించారు. చందనా బౌరీ విజయం కన్నా ఆమె జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ నేత సునీల్ దేవఘర్ ఒక ట్వీట్లో.... చందనా బౌరీ దాచుకున్న సొమ్ము 31,985 రూపాయలేనని తెలిపారు. ఆమె పూరిగుడిసెలో ఉంటుందని, ఆమె భర్త కూలి పనులకు వెళుతుంటాడని, ఆదే వారి జీవనాధారమని వివరించారు. ఆమె వెనుకబడిన కులానికి చెందినదని, ఆమె దగ్గర మూడు గొర్రెలు, మూడు ఆవులు ఉన్నాయని తెలిపారు. చందనా బౌరీ ఎన్నికల్లో తన నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అఫిడవిట్లో తన బ్యాకు ఖాతాలో కేవలం 6,335 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భర్త ఖాతాలో 1,561 రూపాయలు ఉన్నాయని పేర్కొంది. తన భర్తకు ఎటువంటి భూమి లేదని తెలిపింది. కాగా చందన 12 వ తరగతి వరకూ చదువుకోగా, భర్త ఎనిమిది వరకూ చదువుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగస్తున్నారు.