బీజేపీ ఆస్తులు 4,847 కోట్లు, రెండో స్థానంలో బీఎస్‌పీ

ABN , First Publish Date - 2022-01-29T01:44:27+05:30 IST

దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ...

బీజేపీ ఆస్తులు 4,847 కోట్లు, రెండో స్థానంలో బీఎస్‌పీ

న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది.


ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో (26.46 శాతం) ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల కేటగిరిలో జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్‌పీ రూ.618.86 కోట్లు ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్‌డీఆర్ డిపాజిట్ల పరంగా ఎస్‌పీకి రూ.434.219 కోట్లు ఉండగా, టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి.


ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు తమ రుణాలను రూ.134.93 కోట్లుగా చూపించాయి. జాతీయ పార్టీలు రూ.74.27 కోట్లు రుణాలు చూపించగా, కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.49.55 కోట్లు చూపించింది. ప్రాంతీయ పార్టీలు రూ.60.66 కోట్ల మేరకు రుణాలున్నట్టు ప్రకటించాయి.

Updated Date - 2022-01-29T01:44:27+05:30 IST