ఏపీలో ఓటేసిన ఈ TRS కార్పొరేటర్ను అనర్హుడిగా ప్రకటించండి..!
ABN , First Publish Date - 2021-10-01T14:48:30+05:30 IST
కడపజిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, వీరపునాయునిపల్లి మండలం, బూసిరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని...
హైదరాబాద్ సిటీ/నిజాంపేట్ : నిజాంపేట్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబందనలకు విరుద్ధంగా ఓటు హక్కు వినియోగించుకున్న 8వవార్డు కార్పొరేటర్ ఊటుకూరి సురేష్రెడ్డిని తెలంగాణా మున్సిపల్ చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయ్కుమార్, పార్టీ నిజాంపేట్ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. గురువారం మేడ్చల్ జిల్లా జాయింట్కలెక్టర్ జాన్శాంసన్కు ఆధారాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ వార్డు కార్పొరేటర్గా కొనసాగుతున్న ఊటుకూరి సురేష్రెడ్డి ఇటీవల కాలంలో కడపజిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, వీరపునాయునిపల్లి మండలం, బూసిరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబందనలను తుంగలో తొక్కిన కార్పొరేటర్ను పదవి నుంచి తొలగించాలని వారు కోరారు. రామచంద్రనాయక్, నరేంద్రచౌదరి, ఆరుణ్, చరణ్, ముఖేష్, శ్రీనివాస్, కుంకీరాము పాల్గొన్నారు.