Rajastan : టైలర్ కన్హయ్య లాల్ హంతకులతో మాకు సంబంధం లేదు : బీజేపీ
ABN , First Publish Date - 2022-07-02T20:18:14+05:30 IST
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇటీవల హిందూ టైలర్ కన్హయ్య లాల్ను
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇటీవల హిందూ టైలర్ కన్హయ్య లాల్ను హత్య చేసినవారితో తమకు ఎటువంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించింది. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించింది. బీజేపీ మైనారిటీ విభాగం చీఫ్ సాదిక్ ఖాన్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అంతకుముందు కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు.
టైలర్ కన్హయ్య లాల్ కిరాతక హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ అట్టారీ (అక్తరి) బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి వేగంగా బదిలీ చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఈ కేసును తివాచీ క్రిందకు నెట్టేయడమేనా? అని ప్రశ్నించింది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాలను సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera) ఈ సందర్భంగా ఉటంకించారు. రాజస్థాన్ బీజేపీ మైనారిటీ యూనిట్ సమావేశాలకు రియాజ్ హాజరవుతూ ఉండేవాడని తెలిపారు. బీజేపీ నేత ఇర్షాద్ చైన్వాలా ఫేస్బుక్ పోస్టులనుబట్టి కూడా రియాజ్కు బీజేపీతో అనుబంధం వెల్లడవుతోందని చెప్పారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chaudary) కూడా ఇదే విధంగా ఓ ట్వీట్ చేశారు. ‘‘నాకు ఆశ్చర్యంగా లేదు, మీకు ఆశ్చర్యంగా ఉందా?’’ అని ప్రశ్నించారు. కన్హయ్య లాల్ హంతకుడు బీజేపీకి చెందిన వ్యక్తేనని పేర్కొంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malaviya) స్పందించారు. ఇది బూటకపు వార్త అని తెలిపారు. కాంగ్రెస్ బూటకపు వార్తలు ప్రచారం చేస్తుండటం తనకు ఆశ్చర్యంగా లేదన్నారు. ఉదయ్పూర్లో కన్హయ్య లాల్ (Kanhayya Lal) హంతకులు బీజేపీ సభ్యులు కాదన్నారు.చొరబడేందుకు వారు చేసిన ప్రయత్నం రాజీవ్ గాంధీని చంపడానికి ఎల్టీటీఈవారు కాంగ్రెస్లో చేరేందుకు చేసిన ప్రయత్నం వంటిదని పేర్కొన్నారు.
కన్హయ్య లాల్ను మంగళవారం రియాజ్ అక్తరి, గోస్ మహమ్మద్ హత్య చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ప్రవక్త మహమ్మద్ను అవమానించినందుకు తాము కన్హయ్య లాల్ను హత్య చేశామని తెలిపారు. వీనిపి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.