డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటుపై.. బీజేపీకి రూ.55 వేలు పెనాల్టీ!

ABN , First Publish Date - 2022-06-29T09:41:38+05:30 IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ రూ.55 వేల పెనాల్టీ విధించింది.

డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటుపై.. బీజేపీకి రూ.55 వేలు పెనాల్టీ!

నిబంధనలకు విరుద్ధమన్న జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ రూ.55 వేల పెనాల్టీ విధించింది. ‘సాలు దొరా.. సెలవు దొర..’ అంటూ నాంపల్లిలోని డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భవన్‌ వద్ద డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండనుందనే  వివరాలను అందులో పొందుపర్చారు. ట్విటర్‌ ద్వారా ఓ నెటిజన్‌ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌(సీఈసీ) అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు. అక్కడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో బ్యానర్‌, కటౌట్‌ ఏర్పాటు చేసినందుకు రూ.5 వేల జరిమానా విధించింది. రెండు ఈ-చలానాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పేరిట జనరేట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినందుకే పెనాల్టీ వేసినట్టు చలానాల్లో పేర్కొన్నారు. జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ బోర్డును మాత్రం తొలగించలేదు. ఇప్పటికీ డిజిటల్‌ బోర్డు అలానే ఉంది.

Updated Date - 2022-06-29T09:41:38+05:30 IST