Goa సీఎల్పీ తిరుగుబాటులో మా ప్రమేయం లేదు: CM Sawant
ABN , First Publish Date - 2022-07-12T20:23:09+05:30 IST
గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటు తలెత్తిందన్న కథనాలపై బీజేపీ ఆచితూచి..
పనజి: గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో 'తిరుగుబాటు' తలెత్తిందన్న కథనాలపై బీజేపీ ఆచితూచి స్పందించింది. ఇందులో బీజేపీ ప్రమేయం ఏమీ లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారంనాడు తెలిపారు. దీనికి ముందు, కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే సమాచారం తెలియకపోవడంతో పార్టీలో చీలక రానుందనే ఊహాగానాలకు తావిచ్చింది. అయితే, వారంతా సోమవారంనాడు రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. విపక్ష పార్టీకి (కాంగ్రెస్కు) వచ్చిన ఇబ్బందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర కాంగ్రెస్లో పరిణామాలపై ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ సావంత్ను మీడియా ప్రశ్నించగా, గోవా సీఎల్పీలో తిరుగుబాటు వ్యవహారానికి బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదని ముక్తసరిగా సమాధానమిచ్చారు. సీఎల్పీ మీట్కు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, వారి ఆచూకీ తెలయడం లేదని సమాచారం తెలియగానే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమై సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ను హుటాహుటిన గోవాకు పంపారు.