బీజేపీది గాడ్సే ఇజం అయితే టీఆర్‌ఎస్‌ది అంబేడ్కర్ ఇజం: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-03T23:24:57+05:30 IST

దేశంలో బీజేపీది గాడ్సే ఇజం అయితే టీఆర్‌ఎస్‌ది అంబేడ్కర్ ఇజమని

బీజేపీది గాడ్సే ఇజం అయితే టీఆర్‌ఎస్‌ది అంబేడ్కర్ ఇజం: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో బీజేపీది గాడ్సే ఇజం అయితే టీఆర్‌ఎస్‌ది అంబేడ్కర్ ఇజమని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతపెద్ద దేశంలో దళితుల కోసం కేవలం 12వేల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో పెడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా దళితులపై బీజేపీకి ఉన్న ప్రేమా అని ఆయన ప్రశ్నించారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గల్లీలో కొట్లాడుతారని, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన మండిపడ్డారు. బీమ్ దీక్ష, ఆందోళన దీక్షలు చేస్తామన్న పార్టీలు అంబేడ్కర్ ఆశయాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలను దేశమంతటా అమలు జరిగే విధంగా రాజ్యాంగం రాసుకుందాం అనే మాటల్లో తప్పేముందన్నారు.


వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ కాదా అని ఆయన నిలదీశారు. రాజ్యాంగాన్ని కొత్తగా రాయలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామన్నారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు కేంద్రం చేసిన అప్పుల గురించి కూడా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. 14మంది ప్రధానులు 56లక్షల కోట్లు అప్పులు చేస్తే, ఒక్క మోడీనే 80లక్షల కోట్ల అప్పులు చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు వందశాతం కరెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-03T23:24:57+05:30 IST