ఆయన గురించి మాట్లాడాలన్న అభిలాష ఇప్పుడు నెరవేరింది: Amit shah
ABN , First Publish Date - 2021-11-14T18:08:50+05:30 IST
ఉపరాష్ట్రపతి వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఆదివారం వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ గ్రాఫ్ పెరగడానికి వెంకయ్య ముఖ్య కారణమని...ఆయన క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. వెంకయ్య నాయుడు విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగారన్నారు. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నో ఉన్నతస్థాయి చర్చల్లో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. వెంకయ్య నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. రైతులకు ఏదో ఒకటి చేయాలని వెంకయ్యనాయుడు పరితపిస్తుంటారని తెలిపారు. కేంద్రమంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారని అమిత్ షా కొనియాడారు.