Bandi sanjay: నలుగురు మహిళల మృతికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణం
ABN , First Publish Date - 2022-08-31T18:27:26+05:30 IST
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ (KCR Government) మూర్ఖత్వమే కారణమని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) విమర్శించారు. బుధవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ (BJP Leader) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు(Harish rao) తీరుపై మండిపడ్డారు. బాధితులను పరామర్శించకుండా సీఎం (Telangana CM) బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్య అని అన్నారు. తెలంగాణ (Telangana) పేదలను వదిలేసి పంజాబ్, బీహార్లో డబ్బులు పంచటం అన్యాయమన్నారు. చనిపోయిన మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. పేదల ప్రాణాల కంటే కేసీఆర్ సర్కార్కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ (KCR)కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతుందని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోమన్నారు. ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్(TRS Chief) పరామర్శించలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ మనిషి కాదు.. రాక్షసుడు అని వ్యాఖ్యలు చేశారు. బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలు చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు.