గత 67 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లల్లో జరిగింది: Satya Kumar
ABN , First Publish Date - 2022-06-01T20:20:25+05:30 IST
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు అవుతోందని, గత 67 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ..
Vijayawada: నరేంద్ర మోదీ (Modi) ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు అవుతోందని, గత 67 ఏళ్లల్లో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్లల్లో జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satya Kumar) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో మోదీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ. 41 వేల కోట్లు జనధన్ ఖాతాల్లో డబ్బులు వేశారని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు భారీగా గృహ నిర్మాణం చేపట్టారన్నారు. 25 లక్షల గృహాలను ఒక్క ఏపీకే కేటాయించారన్నారు. ప్రధాని సురక్ష, జీవన భీమా, అటల్ భీమా యోజన కింద పేదలకు అండగా నిలిచారని, కరోనా సమయంలో కుడా పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రైతుల ఖాతాల్లో 2 లక్షల 3 వేల కోట్ల రూపాయలు వేశారన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రూ. 35 కోట్ల మందికి ముద్ర లోన్స్ ఇప్పించారన్నారు. మహిళా సాధికారిత కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారని సత్య కుమార్ తెలిపారు.
గ్రామీణ ఉపాధి పథకం కీంద రూ. 72 వేల కోట్లు పెంచారని, పంచాయతీలకు 14,15 ఆర్ధిక సంఘం తరపున రూ. 2 లక్షల 96 వేల కోట్లు ఇచ్చారని సత్య కుమార్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో యభై వేల కోట్ల మందికి భీమా సౌకర్యం, సబ్ కా సాత్, సబ్ కా వికాస్తో ముందుకు పోతున్నామన్నారు. ఏపీలో వైసీపీ విధ్వంసంతో పాలన మొదలు పెట్టి... విధ్వంసమే సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక నుంచి తైలం తీయవచ్చన్నట్లు.. ఇసుక నుంచి అవినీతి చేస్తున్నారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. పాలకులు దోపిడీలో ఉంటే... ప్రజలు పొట్ట నింపుకునేందుకు పాట్లు పడుతున్నారని సత్య కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.