కావాలనే మాపై కుట్ర...నా తండ్రికి సంబంధం లేదు: సోమువీర్రాజు కుమార్తె

ABN , First Publish Date - 2022-01-04T15:57:42+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు వ్యవహారానికి సంబంధించి కుమార్తె సూర్యకుమారి స్పందించారు.

కావాలనే మాపై కుట్ర...నా తండ్రికి సంబంధం లేదు: సోమువీర్రాజు కుమార్తె

ఏలూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు వ్యవహారానికి సంబంధించి కుమార్తె సూర్యకుమారి స్పందించారు. ‘‘నా తండ్రికి,  లోన్ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని.. ఇదంతా రాజకీయ కుట్ర.. నా తండ్రి ఇంటికి,  మాకు ఎటువంటి రాకపోకలు, సంబంధాలు లేవు. వివాహం తరువాత  నా తండ్రి ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు. బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే లోన్ తీసుకున్నాం. కావాలనే మాపై కేసు పెట్టారు.  పోలీసులు ఇంతవరకు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. డబ్బు లావాదేవీలకు సంబంధించి నిన్న  మధ్యవర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయి. మా తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సూర్యకుమారి ఆరోపించారు.


అల్లుడిపై కేసేంటంటే...

సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నారని జయరామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు  చీటింగ్, ఫోర్జరీ కేసును నమోదు చేశారు. 

Updated Date - 2022-01-04T15:57:42+05:30 IST