
హైదరాబాద్: భద్రాచల శ్రీరామనవమి వేడుకలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తున్న ఆచారాలను సైతం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి కనీసం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ విజయశాంతి శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘భద్రాచలంలో వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణానికి కావలసిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కేసీఆర్ సర్కార్ ఒక్క పైసా ఇస్తలేదు. వేడుకల్లో సీఎం గానీ, దేవాదాయశాఖ మంత్రి గానీ మేళతాళాల మధ్య నెత్తిన పెట్టుకొని తెచ్చే ఈ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాలయం సొమ్ముతోనే కొంటున్నరు. కానీ, ప్రభుత్వమే సమర్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నరు. ఇందుకు కనీసం పది పైసలు కూడా ఆలయ అకౌంట్లో తెలంగాణ సర్కారు జమ చేస్తలేదు. ఆలయ అధికారులు ఏటా ప్రపోజల్స్ పంపడం... ప్రభుత్వం వాటిని పక్కన పడేయడం పరిపాటిగా మారింది. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు ప్రభుత్వమే డబ్బులిచ్చే సంప్రదాయం తానీషా కాలం నుంచీ వస్తోంది. అయితే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 10న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు జరుగనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది’’..
‘‘నాటి ప్రభుత్వాలు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన జీవో జారీ చెయ్యగానే భద్రాద్రి ఆలయ అధికారులు ప్రభుత్వం పేరిట ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారు. సర్కారు నుంచి డబ్బులు రిలీజ్ కాగానే సొమ్ము స్వామివారి అకౌంట్లో పడేది. కానీ తెలంగాణ వచ్చాక 2014 నుంచి జీవోలు తప్ప కేసీఆర్ సర్కార్ నుంచి పైసా రావడం లేదు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఒకసారి మాత్రమే సీఎం హోదాలో కేసీఆర్ సీతారాములకు పట్టువస్త్రాలు తెచ్చారు. ఆ తర్వాత 2016లో చిన్న దొర హిమాన్షుతో పట్టువస్త్రాలు ఇప్పించడం ఎంత వరకు సమంజసం? సాంప్రదాయలకు పెద్ద పీట వేస్తానని చెప్పుకునే కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతాడు? తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కాలరాస్తున్న కేసీఆర్కు ఆ దేవుడే తగిన శాస్తి చేస్తాడు’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.