మహిళా లోకం కేసీఆర్ సర్కార్కు బుద్ధి చెప్పడం ఖాయం: Vijayashanti
ABN , First Publish Date - 2022-06-14T15:58:00+05:30 IST
రానున్న రోజుల్లో మహిళా లోకం కేసీఆర్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: రానున్న రోజుల్లో మహిళా లోకం కేసీఆర్(KCR) సర్కార్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. ఫేస్బుక్ వేదికగా మాట్లాడుతూ.... తెలంగాణలో కేసీఆర్ నిరకుంశ పాలన రాజ్యమేలుతోందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదలకు అన్యాయమే జరుగుతోందన్నారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, తాజాగా కన్నబిడ్డను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
‘‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని, ఆమెను తమ గ్రామానికే చెందిన ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా అనుమానం ఉందని... తండ్రి ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని నాలుగు రోజులుగా వేడుకుంటున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి గ్రామస్థులతో కలిసి వచ్చిన బాధిత కుటుంబసభ్యులు కొయ్యూరు స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కేసీఆర్... నీ పాలన ఎలా సాగుతోందో చెప్పడానికి ఇదొక్కటి చాలు. బంగారు తెలంగాణ అని ముచ్చట్లు చెప్పడం కాదు. కనీసం మహిళల మీద ఇలా అఘాయిత్యాలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ పాలనలో మహిళలకు కనీస రక్షణ కూడా కరువైంది. తెలంగాణలో వరుస ఘటనలు జరుగుతున్నా కేసీఆర్ నోరు విప్పకపోవడం బాధాకరం. రానున్న రోజుల్లో ఈ మహిళా లోకం కేసీఆర్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అంటూ విజయశాంతి స్పష్టం చేశారు.