
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో వసతులపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘కేసీఆర్.... విద్యార్థుల్ని విస్మరిస్తే వారు నిన్ను కూడా కాలగర్భంలో కలిపేయడం ఖాయం. ఎన్నోసార్లు రుజువైన సత్యమిది... గుర్తుంచుకో’’ అంటూ హెచ్చరించారు. ఓయూలో వసతుల కోసం విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితిని కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. భోజనం సరిగా లేదని, బాత్ రూమ్లకు డోర్లు, లాక్లు లేవని ఓయూ క్యాంపస్ ఆడబిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారన్నారు. అయినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... పైగా ప్రశ్నించే విద్యార్థినులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చూశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన విద్యార్థులు... వసతుల కోసం రోడ్డెక్కి నిరసన చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఓయూ లేడీస్ హాస్టల్లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. వారి కోసం నాలుగు మెస్లు నడుపుతున్నారని, మెనూ ప్రకారం రోజూ బ్రేక్ ఫాస్ట్లో కిచిడి, చపాతి, ఊతప్పం, పూరి, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా... కేవలం ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నారని విజయశాంతి విమర్శించారు. గతంలో వారంలో రెండు సార్లు నాన్ వెజ్ పెట్టేవారని... అయితే కొంతకాలంగా చికెన్ మాత్రం ఇస్తున్నారన్నారు. కనీసం తాగునీరు కూడా సరిగ్గా సప్లై చేయడం లేదని తెలిపారు.
కిటికీలు సరిగ్గా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా... ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇంతకంటే దారుణము ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. దొరగారు ఫామ్ హౌస్లో పడుకొని పాలన చేస్తే.. ఆడబిడ్డలు పడుతున్న కష్టం ఏం తెలుస్తుంది అని నిలదీశారు. ఆడబిడ్డల కష్టాలు పట్టని ఈ సీఎం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా హాస్టల్స్లో సౌలతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘనత ఉస్మానియా సొంతమని విజయశాంతి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి