‘జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రయత్నాలు... ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి అన్నట్లుంది’

ABN , First Publish Date - 2022-06-30T16:53:37+05:30 IST

తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి....

‘జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రయత్నాలు... ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి అన్నట్లుంది’

టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయం

హైదరాబాద్: తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి.... అన్న సామెత గుర్తుకొస్తోందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....  కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తప్పటడుగులు తప్ప ఇంకేం కాదనడానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద ఉదాహరణ అని తెలిపారు. ‘‘జాతీయస్థాయిలో కాంగ్రెస్సేతర... బీజేపీయేతర కూటమి అంటూ బీరాలు పలికిన ఈ పెద్ద మనిషి... విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపిక అనంతరం ఆయనకు మద్దతునిచ్చే విషయంలో ఏ నిర్ణయమూ వెంటనే చెప్పక... బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగానే ఉన్నట్టు నటించి... చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్షకూటమి అభ్యర్థికే మద్దతు పలికి తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే... కాంగ్రెస్‌తో కలిసిపోయేదే అన్నట్టుగా అసలు రంగు బయటపెట్టుకున్నారు’’ అంటూ  బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తుంటే... జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, సోనియాలు ఏమీ స్పందించరన్నారు. పైగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ యువరాజులు రాహుల్, కేటీఆర్... ఇద్దరూ కలసికట్టుగా ఉల్లాసంగా కనిపించారని అన్నారు. ఇంకోపక్క ఇలాంటి విషయాల్లో ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఎంతమాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భిన్నంగా వ్యవహరించదని అందరికీ తెలుసన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పరస్పరం విమర్శించుకున్న టీఆర్ఎస్, ఎంఐఎంలు తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నాయో అందరూ చూస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్ళూ సయామీ ట్విన్స్‌గా ఉంటూ వచ్చిన టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు కాంగ్రెస్ కూడా తోడై మూడు పార్టీలు కలసి సయామీ ట్రిప్లెట్స్ అవతారమెత్తాయని అన్నారు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో పోటీపడుతున్నాయన్నారు. కేసీఆర్ ఎంత కిందా మీదా పడినా ఆయన ప్రతిపాదించిన ఆ బీఆరెస్‌కి స్పందన వస్తే ఒట్టు అని అన్నారు. ఈ సయామీ ట్రిప్లెట్స్‌తో సహా కేసీఆర్ బీఆర్‌ఎస్‌కు.. రాష్ట్రంలో దాని మాతృపార్టీ టీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు. 



Updated Date - 2022-06-30T16:53:37+05:30 IST