ప్రజల ఆస్తులు ధ్వంసం చేసేవాళ్లు దేశరక్షణకు ఎందుకు పనికొస్తారు?: Vishnukuamr raju
ABN , First Publish Date - 2022-06-18T18:24:17+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు తూట్లు పొడిచి, కేంద్రం మీద బురదజల్లే కార్యక్రమం చాలా మంది చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్కు తూట్లు పొడిచి, కేంద్రం మీద బురదజల్లే కార్యక్రమం చాలా మంది చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు(Vishnukumar raju) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళు దేశ రక్షణకు ఎందుకు పనికి వస్తారని ప్రశ్నించారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని హింసవద్దన్నారు. అల్లర్లు అన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయని తెలిపారు. ‘‘గడప గడపకి ప్రభుత్వం అట్టర్ ప్లాప్.. బస్సు యాత్ర సూపర్ ఫ్లాప్.. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్లాప్’’ అంటూ యెద్దేవా చేశారు. మద్యం మీద విపరీతంగా దోచేస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు.
మద్యంపైన జగన్ అండ్ కో దోచేస్తున్నారని ఆరోపించారు. మాటమీద నిలబడే వ్యక్తి జగన్ కాదని ప్రజలకు తెలిసిందన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబును రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. విజన హామీలపై ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రంఫై కేంద్ర పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ‘‘జగన్ గారు మీ పాలనను సరి చూసుకోండి. లేదంటే సెలవు తీసుకోండి’’ అంటూ విష్ణుకుమార్ రాజు హితవుపలికారు.