గుజరాత్ అభివృద్ధి ఫార్ములాతో సీఎం కేసీఆర్ను గద్దెదింపుతాం
ABN , First Publish Date - 2020-09-22T06:05:53+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో గుజరాత్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ఫార్ములాను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తూరు గీత
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో గుజరాత్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ఫార్ములాను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తూరు గీత మూర్తి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాసప్తాహ కార్యక్రమా లను చేపట్టాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కరీంనగర్లో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, 58వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ ఆధ్వర్యంలో చేపట్టిన సేవాసప్తాహ్ కార్యక్రమాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న 70 మంది ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు. 70 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నిత్యావసర సరుకులను గీత చేతుల మీదుగా పంపిణీ చేశారు. జ్యోతినగర్లో అటల్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో గీతామూర్తి మాట్లాడుతూ బాతాల పోశెట్టిగా సీఎం కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
కుటుంబపాలన, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడంపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రజల్లో సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, త్వరలోనే బుద్ధిచెబుతారని అన్నారు. గుజరాత్ ఫార్మూలాతో కేసీఆర్ను గద్దెదించుతామని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని అన్నారు. ట్రిపుల్ తలాక్, సీఏఏ, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్ రద్దు, రామజన్మభూమి వివాదానికి పరిష్కారం చూపించారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు కార్యక్రమాలను చేపట్టి మహిళలకు అండగా నిలుస్తామని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ అన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కొట్టె మురళీకృష్ణ, శివరామయ్య, గాజుల స్వప్న, హరికుమార్గౌడ్, బేతి మహేందర్రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్రావు, కార్పొరేటర్లు మర్రి భావన సతీష్, బండ సుమ రమణారెడ్డి, నక్క పద్మ కృష్ణ, జయశ్రీ, మెండి శ్రీలత, పెద్దపల్లి జితేందర్, నాగసముద్రం లక్ష్మి, ప్రవీణ్, కొలగాని శ్రీనివాస్, కచ్చు రవి, దుర్శెట్టి అనూప్, సుజాత, పుష్పలత, యశోధ, వరాల జ్యోతి, చైతన్య తదితరులుపాల్గొన్నారు.