సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేస్తాం: Etela
ABN , First Publish Date - 2022-01-03T19:53:35+05:30 IST
కేసీఆర్ ప్రభుత్వాన్ని సమయం వచ్చినప్పుడు పాతరేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వాన్ని సమయం వచ్చినప్పుడు పాతరేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సోమవారం ఈటెల మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్పై కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో హింసకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. చక్రవర్తి మాదిరి ఎవరి మాట విననని కేసీఆర్ అంటున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయనే తన సొంత కార్యాలయంలో సంజయ్ జాగరణ దీక్ష పెట్టుకున్నారని ఆయన తెలిపారు. శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణలా కరీంనగర్ కమిషనర్ వ్యవహరించారని మండిపడ్డారు. సంజయ్ని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని... బీజేపీ కేసులకు భయ పడదని స్పష్టం చేశారు. ‘‘ఇది బెంగాల్ కాదు... ఇది తెలంగాణ గడ్డ.. ఎన్నో త్యాగాలు ఇక్కడ చేసిన పార్టీ బీజేపీ’’ అని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత ఆగం ఆగం కేసీఆర్ అవుతున్నారని యెద్దేవా చేశారు. కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదులుతోందన్నారు. ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం సమంజసం కాదని ఈటెల రాజేందర్ అన్నారు.