నాపై కేసులున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: ఎంపీ CM ramesh
ABN , First Publish Date - 2022-07-11T19:43:03+05:30 IST
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) ఎంపీ సీఎం రమేష్(CM Ramesh) ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతో బీజేపీలో చేరినట్లు కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘‘నాపై సీబీఐ, ఈడీ, కేంద్రానికి సంబంధించిన ఎలాంటి కేసులు లేవు. నాపై కేసులున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. గతంలో కేటీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. ‘‘ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు సరి చేసుకుంటారని భావిస్తున్నా’’ అంటూ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
కేసీఆర్ ఏమన్నారంటే...
ఎన్ని తప్పులు చేసినవారైనా బీజేపీ కండువా కప్పుకోగానే ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అన్నట్టు వారి తప్పులన్నీ మాఫీ చేసేస్తున్నారని కేసీఆర్ కమలనాథులపై ధ్వజమెత్తారు. తెలుగు నాట సుజనా చౌదరి, బెంగాల్లో ముకుల్ రాయ్ తదితర నేతల పేర్లను ప్రస్తావించి మరీ ఒక వీడియోను ప్రెస్మీట్లో ప్రదర్శించారు. అందులో.. సుజనా చౌదరి, సీఎం రమేశ్, సువేందు అధికారి, ముకుల్ రాయ్, నారాయణ్ రాణే, హిమంత విశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సిందియా.. ఇలా సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కొన్న పలువురు బీజేపీలో చేరిన దృశ్యాలున్నాయి. వారంతా బీజేపీ కండువా కప్పుకోగానే 64 చెట్ల పసరు తాగినట్లు పవిత్రం అయిపోయారని ఎద్దేవా చేశారు.