Lakhimpur: ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-07T16:40:17+05:30 IST

లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు...

Lakhimpur: ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

హింసకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు...రైతులకు న్యాయం జరగాలంటూ డిమాండ్ 

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.లఖింపూర్ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన కొత్త వీడియోను వరుణ్ గాంధీ షేర్ చేస్తూ రైతుల గుంపుపై కారు నడిపి, వారిని హత్య చేశారని వరుణ్ ఆరోపించారు. ‘‘లఖింపూర్ వీడియోలో స్పష్టంగా ఉంది. రైతులను హతమార్చడం ద్వారా వారి నోరు మూయించలేరు. చిందిన రైతుల అమాయక రక్తానికి జవాబుదారీతనం ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి.’’ అంటూ వరుణ్ వీడియోను షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు.


లఖింపూర్ ఖేరీ హింసకు వ్యతిరేకంగా ఎంపీ వరుణ్ గాంధీ మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. మంగళవారం అతను లఖింపూర్ ఖేరి ఘటన వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులను కొట్టిన పోలీసులను వెంటనే గుర్తించి, వారిని అరెస్టు చేయాలని వరుణ్ డిమాండ్ చేశారు.‘‘లఖింపూర్ ఖేరీలో ఉద్దేశపూర్వకంగా రైతులపై కారు నడిపిన వీడియో ఎవరి ఆత్మనైనా కలచివేస్తుంది. ఈ వీడియోను పోలీసులు గమనించాలి, ఈ వాహనాల యజమానులను గుర్తించాలి, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించి వారిని వెంటనే అరెస్టు చేయాలి’’ అని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-10-07T16:40:17+05:30 IST