బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు
ABN , First Publish Date - 2021-03-01T08:52:19+05:30 IST
బీజేపీ ఎంపీలతో తెలంగాణకు జరిగిన లాభమేమీ లేదని, పైగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కేంద్రం తెలంగాణకు పైసా ఇవ్వలేదు: ఎర్రబెల్లి
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 28: బీజేపీ ఎంపీలతో తెలంగాణకు జరిగిన లాభమేమీ లేదని, పైగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల 150 మెడికల్ కాలేజీలు మంజూరైతే బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు మంచి చెడులను విశ్లేషించుకొని ప్రశ్నించే వారికి కాకుండా సమస్యను పరిష్కరించేవారికి ఓటేయాలని కోరారు. పరిష్కరించే సత్తా ఉన్న నేత పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్రం ప్రభుత్వ కంపెనీలను అదానీ, అంబానీలకు అమ్ముతోందని, రైళ్లను, ప్లాట్ఫారాలను కూడా ప్రైవేట్పరం చేస్తోందని ఆరోపించారు.