చిరకాల వాంఛ నెరవేరింది
ABN , First Publish Date - 2020-08-06T06:27:51+05:30 IST
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజతో దేశ ప్రజల చిరకాలవాంఛ నెరవేరిందని ఎంపీ బండి సంజయ్ కుమార్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కరీంనగర్ కల్చరల్/గణేశ్నగర్, ఆగస్టు 5: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజతో దేశ ప్రజల చిరకాలవాంఛ నెరవేరిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మందిర నిర్మాణ భూమిపూజ సందర్భంగా ఆయన తన ఇంట్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. ఆగస్టు 5 చరిత్రలో మరపురాని రోజుగా మిగిలిపోతుందని చెప్పారు.
కరీంనగర్ సప్తగిరికాలనీ కోదండరామాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు, భజనలు చేశారు. వాల్మీకినగర్లోని వాల్మీకి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. భగత్నగర్ అంజనాద్రిపై భారీ హనుమాన్ విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. గణేశ్నగర్లో ఆధ్యాత్మికవేత్త ఉప్పుల రామేశం దంపతులు కాషాయ ధ్వజాన్ని ఎత్తి తమ భక్తిని చాటుకున్నారు. 38వ డివిజన్లో బాలభక్త ఆంజనేయస్వామి ఆలయంలో కార్పొరేటర్ కచ్చు రవి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గాంధీ రోడ్ రామాలయంలో ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు.