Biggest Shock: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరి, శివరాజ్ సింగ్‌కు ఉద్వాసన

ABN , First Publish Date - 2022-08-17T20:53:23+05:30 IST

బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు..

Biggest Shock: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరి, శివరాజ్ సింగ్‌కు ఉద్వాసన

న్యూఢిల్లీ: బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో (Parliamentary board) కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ (Shivraj singh Chouhan)కు పార్లమెంటరీ బోర్డులో ఈసారి చోటు దక్కలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొత్తగా చోటు కల్పించగా, పలువురు కొత్త ముఖాలను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. సంస్థాత మార్పుల్లో భాగంగా పార్లమెంటరీ బోర్డులో కీలకమార్పులను బీజేపీ చేపట్టింది.


బీజేపీలో అత్యంత కీలకంగా భావించే పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరిని మినహాయించడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రుల్లో గడ్కరి ఒకరు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు కూడా. మాజీ అధ్యక్షులను పార్లమెంటరీ బోర్డులో కొనసాగించడం బీజేపీలో ఇంతవరకూ సంప్రదాయంగా కొనసాగుతోంది. కాగా, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పార్లమెంటరీ బోర్డులో తిరిగి చోటు దక్కింది.


మరో ఆశ్చర్యం కలిగించే అంశం కూడా ఈసారి చోటు చేసుకుంది. గత ఏడాది బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 77 ఏళ్ల కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యడియూరప్పకు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. ఇటీవల హిమంత్ బిశ్వా శర్మకు మార్గం సుగమం చేసిన అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్‌కు పార్లమెంటరీ బోర్డులోనూ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ చోటు దక్కింది. అలాగే, శివసేన రెబల్ ఏక్‌నాథ్  షిండేతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకునేందుకు ఇష్టపడి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఎలక్షన్ కమిటీలో బీజేపీ అధిష్ఠానం చోటు కల్పించింది.

Updated Date - 2022-08-17T20:53:23+05:30 IST