మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పెద్దఎత్తున అక్రమాలు: రేవంత్
ABN , First Publish Date - 2022-08-20T02:30:07+05:30 IST
మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలతో రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడా లేని విధంగా రాజకీయ దుర్మార్గానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాడాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక తేదీ ఖరారుకాకున్నా బహిరంగ సభల సందడి ఊపందుకుంది. పోలింగ్ సమీపించిందనే స్థాయిలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు. మునుగోడులో ఈనెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోంమంత్రి అమిత్షా బహిరంగ సభలు ఉన్నాయి. సీఎం సభ రోజే ప్రతీ గ్రామంలో ఒక కాంగ్రెస్ దిగ్గజంతో పాదయాత్ర నిర్వహించాలని పీసీసీ నిర్ణయంతో నియోజకవర్గంలో హడావిడి నెలకొంది. మరోవైపు ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, సభలకు జనాల తరలింపునకు పెద్ద సంఖ్యలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో మునుగోడు వేడి సర్వత్రా కనిపిస్తోంది. ఏ గ్రామంలో చూసినా ఖరీదైన కార్లు, బడా నేతల హడావిడి, సభలు, సమావేశాలతో సందడి వాతావరణం నెలకొంది.