2022లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది : మనీశ్ శిశోడియా

ABN , First Publish Date - 2021-03-03T20:27:21+05:30 IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ప్రజలు విసుగెత్తిపోయారని ఆమ్

2022లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది : మనీశ్ శిశోడియా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ప్రజలు విసుగెత్తిపోయారని  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన మునిసిపల్ వార్డు ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూసినపుడు 2022లో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను నమ్ముతున్నారన్నారు. 


ఉత్తర ఢిల్లీలోని రోహిణి-సి, షాలిమార్ బాగ్ నార్త్; తూర్పు ఢిల్లీలోని త్రిలోక్ పురి, కల్యాణ్ పురి, చౌహాన్ బంగర్ వార్డులకు ఉప ఎన్నికలు ఆదివారం జరిగాయి. కల్యాణ్ పురిలో 7,043 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి ధీరేంద్ర కుమార్ విజయం సాధించారు. అదేవిధంగా షాలిమార్ బాగ్‌లో 2,705 ఓట్ల ఆధిక్యంతో సునీత మిశ్రా (ఆప్), రోహిణి-సి నుంచి 2,985 ఓట్ల ఆధిక్యంతో రామ చంద్ర (ఆప్), త్రిలోక్ పురి నుంచి 4,986 ఓట్ల ఆధిక్యంతో విజయ్ కుమార్ (ఆప్), చౌహాన్ బంగర్ నుంచి 10,642 ఓట్ల మెజారిటీతో జుబేర్ అహ్మద్ చౌదరి (కాంగ్రెస్) విజయం సాధించారు. 


ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచారని మనీశ్ శిశోడియా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజలు బీజేపీతో విసుగెత్తిపోయారని, ఈ ఎన్నికలు అందుకు నిదర్శనమని తెలిపారు. 2022లో జరిగే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ఆప్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు. బీజేపీ ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారన్నారు. రానున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ, పని చేసే రాజకీయాలను తీసుకొస్తారని జోస్యం చెప్పారు. 


అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ప్రజలను అభినందించారు. సుపరిపాలనకు మరోసారి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారన్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లలో 15 ఏళ్ళ బీజేపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఈ కార్పొరేషన్లలో ఆప్‌ను అధికారంలోకి తేవాలని ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. 


Updated Date - 2021-03-03T20:27:21+05:30 IST