Madrasa issue: ఆర్ఎస్ఎస్-బీజేపీ కొత్త డ్రామా: ఒవైసీ

ABN , First Publish Date - 2022-09-25T21:48:09+05:30 IST

అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ ''కొత్త డ్రామా''అడుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..

Madrasa issue: ఆర్ఎస్ఎస్-బీజేపీ కొత్త డ్రామా: ఒవైసీ

న్యూఢిల్లీ: అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ ''కొత్త డ్రామా''అడుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మద్రసాల సర్వేలు, వాటి కూల్చివేతలపై అంశంపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌లో పర్యటిస్తున్న ఒవైసీ..బీజేపీ ఆర్ఎస్ఎస్ కొత్త డ్రామా ఆడుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవన్ ఢిల్లీలోని మద్రసాలకు వెళ్లారని, కానీ అసోంలో మద్రసాలు కూలగొట్టేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌లో మద్రసాలపై సర్వే జరుపుతున్నారని ఒవైసీ అన్నారు. బీజేపీకి చెప్పుకునేందుకు ఏమీ లేనందున, ఎన్నికలకు ముందు హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టేందుకు చూస్తుంటారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సెప్టెంబర్ 22న ఓల్డ్ ఢిల్లీలోని అజాద్ మార్కెట్ మద్రసా తాజ్వీదుల్ ఖురాన్‌ను సందర్శించిన నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసారు. అక్కడి పిల్లలతో భగవత్ ముఖాముఖీ మాట్లాడటంపాట వారికి కొన్ని సూచనలు కూడా భగవత్ చేశారు.


''మోహన్ భగవత్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. అతిపెద్ద సంస్థకు అధిపతి. మద్రసాలో ఏమి నేర్పుతున్నారనేది అక్కడి పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు'' అని ఆల్ ఇండియా ముస్లిం ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ ఇలాసీ తెలిపారు. భగవత్ మద్రసాలోని పిల్లలతో మాట్లాడుతూ, భారత భవిష్యత్తు పిల్లలపైనే ఉందని, చదువులపై పిల్లలు దృష్టిసారించి, దేశం కోసం పనిచేయాలని సూచన చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ సుమారు గంటసేపు మద్రసాలో ఉన్నారని, టీచర్‌ని, పిల్లల్ని కలుసుకున్నారని మద్రసా డైరెక్టర్ మహ్మదుల్ హసన్ తెలిపారు. మద్రసాను భగవత్ సందర్శించడం కూడా ఇదే మొదటిసారి కావడం కూడా చర్చకు దారితీసింది.


Updated Date - 2022-09-25T21:48:09+05:30 IST