సీఎం కేసీఆర్ మాటలు బారెడు.. పనులు మూరెడు: విజయశాంతి
ABN , First Publish Date - 2022-05-17T01:39:15+05:30 IST
సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే మాటలు బారెడని..
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే మాటలు బారెడని... చేసే పనులు మాత్రం మూరెడు అని ఆమె విమర్శించారు. దొరగారి ఎన్నికల హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయన్నారు. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విజయశాంతి గుర్తు చేశారు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నారని, వరంగల్ ఒక్క చోటే కాదని, తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజానీకమే కేసీఆర్ సర్కార్ను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వ్యాఖ్యానించారు.
‘‘తమకు ఇల్లు కట్టిస్తమని చెప్పి కట్టివ్వకపోగా... తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు... గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందమని పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. వీటిని రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నారు. కొన్నిచోట్ల అగ్గిపెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు రోడ్డెక్కుతున్నారు. కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్థోమత లేక అల్లాడుతున్నారు.’’ అని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.