Nupur Sharma crisis: టీవీ డిబేట్లలో అప్రమత్తంగా ఉండాలంటూ బీజేపీ కొత్త రూల్స్
ABN , First Publish Date - 2022-06-08T00:52:12+05:30 IST
ఓ టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం సృష్టించిన
న్యూఢిల్లీ: ఓ టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇంటా బయటా తీవ్ర వివాదం సృష్టించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) అప్రమత్తమైంది. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీవీ షోలలో పాల్గొనే తమ ప్రతినిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించింది.
దాని ప్రకారం.. ఇకపై టీవీ చర్చల్లో అధికారిక ప్రతినిధులు, ప్యానలిస్టులు మాత్రమే పాల్గొనాలి. చర్చల్లో పాల్గొనేవారు మతపరమైన అంశాలు మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నిగ్రహంగా ఉండాలి. సహనం కోల్పోకూడదు. ఉద్రేకపడకూడదు. అలాగే, రెచ్చగొట్టినా సరే.. పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించకూడదు.
చర్చలో పాల్గొనడానికి ముందే అందుకు సిద్ధం కావాలి. పార్టీ లైన్ను గుర్తించి దాని ప్రకారమే మాట్లాడాలి. పార్టీ ఎజెండా నుంచి ఎవరూ పక్కకు జరగొద్దని, ఎవరి ట్రాప్లోనూ పడకుండా జాగ్రత్తగా ఉండాలని బీజేపీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రజా సంక్షేమం కోసం, పేదల కోసం ఏం చేశామో చర్చల్లో స్పష్టంగా వివరించాలని పేర్కొన్నట్టు తెలుస్తోంది.