యూపీని నిలబెట్టుకున్న బీజేపీ.. నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’

ABN , First Publish Date - 2022-03-10T19:32:41+05:30 IST

అనుకున్నట్లే ఉత్తర ప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది.

యూపీని నిలబెట్టుకున్న బీజేపీ.. నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’

అనుకున్నట్లే ఉత్తర ప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల వ్యూహా రచన మరోసారి ఫలించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇదిలాఉంటే.. తాజాగా వెలువడిన యూపీ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయా? మోదీ, అమిత్‌షా ద్వయం ఆపరేషన్ ‘తెలంగాణ’ మొదలెట్టబోతున్నారా? సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో బీజేపీకి కలిసి రానుందా? అంటే.. చాలా వరకు అవుననే సమాధానం వస్తుంది. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుంది. దాంతో ప్రత్యామ్నాయ రేసులో మరికాస్త ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. 


ఇప్పటికే రెండు ఉప ఎన్నికల్లో(దుబ్బాక, హూజురాబాద్) బీజేపీ విజయం సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ గెలిచేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు బీజేపీకే పట్టం కట్టడంతో టీఆర్ఎస్‌కు నిరాశ తప్పలేదు. అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎవరూ ఊహించని విధంగా భారీగా సీట్లను సాధించింది. టీఆర్ఎస్‌కు గట్టిపోటీని ఇచ్చింది. ఇలా కొంతకాలంగా తెలంగాణలో మిగతా ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ ప్రభావం కూసింత ఎక్కువగానే ఉంది. అటు కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో మరి దారుణంగా ఉంది. గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో బీజేపీ ఎంతోకొంత ప్రభావం చూపడం ఖాయం. ఇక అమిత్‌షా, మోదీ కాన్సంట్రేట్ చేస్తే బీజేపీ అనుకుంటున్నదాని కంటే కూడా మంచి ఫలితాలు రావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 


అమిత్ షా కూడా పలుమార్లు ఇదే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారట కూడా. కేసీఆర్ సర్కారుతో రాజీపడొద్దంటూ.. ప్రజా సమస్యలపై పోరాడాలంటూ ఆయన సూచనలు చేశారు కూడా. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణయేనీ.. అక్కడ వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలన్న పంతంతో పనిచేయాలని స్పష్టం చేశారట కూడా. ప్రస్తుతం కేసీఆర్ కూడా ఢిల్లీ బాట పడుతూ ఉండటం.. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాట్లను చేస్తూ ఉండటాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. బీజేపీతో పెట్టుకుంటే ఏపీలో టీడీపీకి ఏర్పడిన పరిస్థితినే టీఆర్ఎస్‌కు ఎదురవుతుందన్న సంగతిని తెలియజేయాలన్న పంతంతో అమిత్ షా, మోదీ ద్వయం ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. మరి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావంతో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ప్రయత్నాలను కేసీఆర్ ఆపేస్తారా..? లేక బీజేపీని ఓడించేందుకు ప్రాంతాయ శక్తులను ఏకం చేస్తారా..? కేసీఆర్ ప్లాన్ ఏంటి..? అమిత్ షా వ్యూహాలేంటన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Updated Date - 2022-03-10T19:32:41+05:30 IST