కరోనాను గెలిచినా ప్రమాదం అంచునే.. పొంచి ఉన్న బ్లాక్ ఫంగస్

ABN , First Publish Date - 2021-05-08T00:38:22+05:30 IST

కరోనానుంచి బయటపడిన వారిలో తాజాగా ఓ ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడుతోంది. దీనిని బ్లాక్ ఫంగస్‌(మ్యూకోర్మిసిస్)గా వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయే..

కరోనాను గెలిచినా ప్రమాదం అంచునే.. పొంచి ఉన్న బ్లాక్ ఫంగస్

కరోనానుంచి బయటపడిన వారిలో తాజాగా ఓ ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడుతోంది. దీనిని బ్లాక్ ఫంగస్‌(మ్యూకోర్మిసిస్)గా వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ బ్లాక్ ఫంగస్ బయటపడగా, తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ ఈ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే దాదాపు 40మంది ఈ ఫంగస్ బారిన పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరిలో 8మంది ఏకంగా చూపును సైతం కోల్పోయారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్ కూడా ప్రాణాపాయం కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే దీనిని చికిత్స ద్వారా నయం చేయవచ్చని, కానీ ఆలస్యమైతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


కరోనా పేషెంట్లలోనే ఎందుకు..?

బ్లాక్ ఫంగస్ కరోనా పేషెంట్లలోనే ఎక్కువగా కనిపించడానికి గల కారణాన్ని ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్‌లోని ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వివరించారు. కరోనా పేషెంట్లలో ఎక్కువ మంది డయాబెటిస్‌తో బాధపడుతుండడం, వారికి కరోనా ట్రీట్‌మెంట్‌లో అందించే ఔషదాల ప్రభావం వెరసి ఈ ఫంగస్ బారిన పడడానికి ఓ కారణంగా వివరించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ ఫంగస్ కనిపిస్తుందని, అయితే డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కాగా.. గతేడాది కూడా ఈ ఫంగస్ బారిన అనేకమంది పడ్డారని, అనేకమంది చూపు కోల్పోగా, ఇకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని ఆసుపత్రి ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ మనీష్ ముంజల్ వెల్లడించారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేసే అవకాశాలుంటాయని తెలిపారు. 


ఎలా వస్తుంది?

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. మ్యూకోర్మిసెటెస్ అనే ఫంగి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ బాధితుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది చుట్టూ వాతావరణంలోనే ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చర్మం తెగినా, కాలినా, ఇతర చర్మ సంబంధిత గాయాల్లోనూ ఈ ఫంగి కనిపిస్తుంది.


లక్షణాలు ఏంటి?

సూరత్‌లోని ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సంకేత్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 2-3 రోజుల్లోనే ఈ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయి. మొదట సైనస్‌లో, తర్వాత మెల్లగా కళ్లలో దీని లక్షణాలు కనిపిస్తాయట. ఈ ఫంగస్ ముక్కులో ఉన్నప్పుడు ఏదో అడ్డం ఏర్పడినట్లు ఉంటుందట. నలుపు రంగులో ముక్కులో కణితలు ఏర్పడతాయట. కళ్లలోకి చేరేసరికి కళ్లు, చెంపల వాపుకు కారణమవుతుందట.


ఎలా ఎదుర్కోవాలి:

ముఖంలో వాపు కనిపించడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, నోటిపై భాగంలో నల్లటి గాయాల మాదిరిగా కనిపించి తీవ్రమైన బాధ కలిగిస్తూ పెద్దవువుతుంటాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే బయాప్సీ చేయించుకోవాలి. అలాగే వైద్యుల సలహాతో యాంటీ-ఫంగల్ థెరపీ చేయాలని, లేకపోతే తర్వాతి 24 గంటల్లో మెదడు వరకూ కూడా ఇది వెళ్లవచ్చని వైద్యులు హెచ్చరించారు. 

Updated Date - 2021-05-08T00:38:22+05:30 IST