పేలుడా.. భూకంపమా?
ABN , First Publish Date - 2021-02-28T05:46:45+05:30 IST
తుళ్లూరు, మంగళగిరి మండలాలతోపాటు అమరావతి..
రాజధాని ప్రాంతంలో ప్రకంపనలు
భూకంపం వదంతులను కొట్టిపారేసిన రైతులు
క్వారీయింగ్ కారణంగానే కంపించిదంటున్న ప్రజలు
తుళ్లూరు, అమరావతి, తాడికొండ: తుళ్లూరు, మంగళగిరి మండలాలతోపాటు అమరావతి మండలం వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అదేవిధంగా తాడికొండ శివారు బడేపురంలో భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దంతో రెండు క్షణాలపాటు కంపించడంతో ఇళ్లలోని కిటికీలు, తలుపులు కొట్టుకున్నాయని ప్రజలు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. కాగా.. ఇది క్వారీయింగ్లో పేలుడు కారణంగా జరిగినట్లు పలువురు అంటున్నారు. క్వారీ నిర్వాహుకులు భారీ జిలిటెన్ స్టిక్స్ వాడడం వల్ల కంపించిందంటున్నారు.
కర్లపూడిలో అడ్డూఅదుపూ లేకుండా క్వారీయింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే భూమి కంపించిందని ప్రజలు భావిస్తున్నారు. భూ కంపమైతే రిక్టర్ స్కేల్పై నమోదు అవుతుంది. కానీ ఎటువంటి రికార్డు నమోదు కాలేదు. దీనిని బట్టి చూస్తే పేలుడు పదార్థమే ప్రకంపనలకు కారణమని చెపుతున్నారు. జగన్ మీడియా మాత్రం రాజధానిలో భూకంపం వచ్చిందని ప్రచారం చేస్తోందని రాజధానికి భూములిచ్చిన రైతులు మండిపడుతున్నారు. తెల్లవారుజామున పేలుడుతో భారీ గొయ్యి పడితే దానిని వెంటనే పూడ్చారని రైతులు పేర్కొంటున్నారు.