శరణాగతితోనే దైవానుగ్రహం

ABN , First Publish Date - 2022-06-28T04:58:33+05:30 IST

భక్తులు దైవ అనుగ్రహం పొందాలంటే... శరణాగతితోనే సాధ్యమవుతుందని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి అన్నారు. సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆహ్వానం మేరకు మాచిరెడ్డిపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.

శరణాగతితోనే దైవానుగ్రహం
పూజలు నిర్వహిస్తున్న చిన్నజీయర్‌ స్వామి

వల్లూరు,  జూన్‌ 27 : భక్తులు దైవ అనుగ్రహం పొందాలంటే... శరణాగతితోనే సాధ్యమవుతుందని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి అన్నారు. సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆహ్వానం మేరకు మాచిరెడ్డిపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామి రాక సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామి మాట్లాడుతూ ఎవరైతే దైవాన్ని ఆశ్రయిస్తారో వారిపట్ల భగవంతుని అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ మాటలను దాదాపు వెయ్యి ఏళ్ళ క్రితమే రామానుజాచార్యులు భక్తులకు ఉపదేశించారని పేర్కొన్నారు. దైవానికి కులం, మతం అనే తారతమ్యం లేకుండా సర్వమానవాళి సమానమేనని తెలిపారు. ఎక్కడైతే అందరూ కలిసి ఆనందంగా ఉంటారో.. ఆ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇలాంటి దేవాలయం నిర్మించి తమలాంటి వారితో భ క్తులకు అనుగ్రహ బాషణం అందజేస్తున్న నరసింహారెడ్డిని అభినందించాలన్నారు. దైవాన్ని ప్రతీ ఒక్కరూ నిత్యం పూజించాలని...  అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయని... అందరూ సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో పుత్తా నరసింహారెడ్డి సోదరుడు పుత్తా రామచంద్రారెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదిర్శ హరిప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి రామచంద్రారెడ్డి,  ఆరు మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-28T04:58:33+05:30 IST