ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ కాకుండా ఉండాలంటే..?

ABN , First Publish Date - 2022-05-06T21:36:52+05:30 IST

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు

ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ కాకుండా ఉండాలంటే..?

ఆంధ్రజ్యోతి(06-05-2022)

ప్రశ్న: వేసవికాలంలో డీహైడ్రేషన్‌ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?


- రమణ, ఆదిలాబాద్‌


డాక్టర్ సమాధానం: ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా పోతుంది. చెమట బాగా పట్టేవారికి ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తిరిగి భర్తీ చేసుకునేలా ఆహారం ఉండాలి. ఇలా కానప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడ దెబ్బ తగలడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతాయి. వీటిని నివారించాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు ఏదో ఓ రూపంలో తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, భోజనంలో సాంబార్‌ లేదా రసం లేదా సూప్స్‌ తీసుకోవడం మొదలైనవన్నీ ఉపయోగ పడతాయి. నీరు అధికంగా ఉండే పుచ్చ, కర్బుజా, ద్రాక్ష వంటి పండ్లను కూడా రోజుకు ఒకటి రెండుసార్లు తీసుకుంటే మంచిది. భోజనంతో పాటు నీళ్లు ఎక్కువ ఉండే కీరా, టొమాటో, ఉల్లి మొదలైన వాటితో చేసిన సలాడ్లను తీసుకోవాలి. కారం, మసాలాలు ఉన్న ఆహారం తగ్గించాలి. నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్ళు, బేకరి ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ మొదలైనవి తగ్గించాలి లేదా మానెయ్యాలి. వ్యాయాయం చేసేవారైతే తప్పని సరిగా వ్యాయామానికి ముందు అరలీటరు తరువాత అరలీటరు నీళ్లు తీసుకోవాలి. గంట కంటే ఎక్కువ వ్యాయామం చేస్తే ఎలెకో్ట్రలైట్స్‌తో కూడిన నీళ్లు తీసుకోవడం మంచిది. వ్యాయామ సమయం ఉదయం వేళలు లేదా సాయంత్రం వేళల్లో ఉండేలా జాగ్రత్తపడాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Read more