ప్రైవేటు విద్యాసంస్థలో బయటిప్రాంతాల ఓటర్లు
ABN , First Publish Date - 2021-11-15T07:34:43+05:30 IST
అధికార పార్టీ సర్పంచికి చెందిన కుప్పంలోని విద్యాసంస్థ భవనంలో దొంగ ఓటర్లు దిగిపోయారని సమాచారంతో అందడంతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాత్రి అక్కడకు చేరుకున్నాయి.
కుప్పం, నవంబరు 14: ఆదివారం రాత్రి గడిచేకొద్దీ దొంగ ఓటర్ల అంశం కుప్పంలో ఉద్రిక్తత పెంచుతూ పోయింది. పట్టణంలోని ఓ అధికార పార్టీ సర్పంచికి చెందిన ప్రైవేటు విద్యా సంస్థ భవనంలో ఇతర ప్రాంతాలకు చెందిన దొంగ ఓటర్లు దిగిపోయారని సమాచారం అందడంతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నాయి. లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు వెళ్లనివ్వలేదు. ఇక్కడెవరూ లేరని, ఎన్నికల సిబ్బంది కోసం భోజనాలు వండుతున్నారని చెప్పారు. తమలో ఐదుగురిని లోనికి పంపిస్తే నిర్ధారించుకుంటామని టీడీపీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. ఈ విషయమై పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు అక్కడినుంచి టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టి వెనక్కు పంపించేశారు.