నాటు బాంబు పేలి రౌడీకి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-06-17T13:43:39+05:30 IST

తిరువళ్లూరు జిల్లా మాంగాడు వద్ద బుధవారం రాత్రి మోటారు బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు తీసుకెళుతున్న సంచిలో నుంచి నాటు బాంబు జారిపడి పెద్ద శబ్దంతో

నాటు బాంబు పేలి రౌడీకి తీవ్ర గాయాలు

చెన్నై, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): తిరువళ్లూరు జిల్లా మాంగాడు వద్ద బుధవారం రాత్రి మోటారు బైకుపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు తీసుకెళుతున్న సంచిలో నుంచి నాటు బాంబు జారిపడి పెద్ద శబ్దంతో పేలింది. ఈ సంఘటనలో రహదారి పక్కనే ఉన్న టీ షాపు అద్దాలు పగిలాయి. బైకులో ప్రయాణించిన ముగ్గురిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మాంగాడు భరణిపుదూరు వద్ద బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ మోటారు బైకుపై ముగ్గురు వెళుతుండగా వారిలో ఒకడి చేతిలో ఉన్న సంచి నుంచి ఓ నాటు బాంబు జారి రోడ్డుపై పడి పెద్ద శబ్దంతో పేలింది. దీంతో బైకుపై ప్రయాణించిన ముగ్గురు రోడ్డుపై పడటంతో గాయాలయ్యాయి. వీరిలో వినోద్‌కుమార్‌ (27) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడితోపాటు బైకుపై ప్రయాణించిన మిగిలిన ఇద్దరూ స్వల్పగాయాలతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన గురించి స్థానికులు ఫిర్యాదు చేయడంతో మాంగాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వినోద్‌కుమార్‌ వద్ద విచారణ జరిపినప్పుడు అతడు పేరుమోసిన రౌడీ అని తెలుసుకున్నారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సలందించారు. వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి పారిపోయిన ఇద్దరి వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా రౌడీ వినోద్‌కుమార్‌తో ప్రయాణించినవారు తీసుకెళ్ళిన సంచిలో మరికొన్ని నాటుబాంబులు కూడా లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2022-06-17T13:43:39+05:30 IST