Train Journey: కీలక తీర్పు వెల్లడించిన కోర్టు.. కిక్కిరిసి ఉన్న రైలు ఎక్కే క్రమంలో కిందపడితే..

ABN , First Publish Date - 2022-04-27T01:39:15+05:30 IST

బొంబాయి హైకోర్టు ముంబైలోని లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేవారికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. రద్దీ కారణంగా లోకల్ ట్రైన్స్‌లో ఎక్కుతున్న వ్యక్తి పొరపాటున..

Train Journey: కీలక తీర్పు వెల్లడించిన కోర్టు.. కిక్కిరిసి ఉన్న రైలు ఎక్కే క్రమంలో కిందపడితే..

ముంబై: బొంబాయి హైకోర్టు ముంబైలోని లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేవారికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. రద్దీ కారణంగా లోకల్ ట్రైన్స్‌లో ఎక్కుతున్న వ్యక్తి పొరపాటున కిందపడి గాయాలపాలైతే సదరు వ్యక్తికి రైల్వేనే నష్టపరిహారం చెల్లించాలని బొంబాయి హైకోర్టు తీర్పు ప్రకటించింది. లోకల్ ట్రైన్‌లో ఎక్కుతూ గాయపడిన 75 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన కేసులో బొంబాయి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. Justice Bharati Dangre నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ కేసులో స్పందిస్తూ.. గాయపడిన ఆ 75 ఏళ్ల వ్యక్తికి Western Railways రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. రైలులో ఎక్కువ రద్దీ ఉండటం మూలాన కిందపడిపోయాననేది ఆ వృద్ధుడి తరపు వాదన.



అయితే.. Western Railways మాత్రం.. రైల్వే చట్టంలోని సెక్షన్ 124(A) పరిధిలోకి ఈ ఘటన రాదని.. కదిలి వెళ్లిపోతున్న రైలు ఎక్కడానికి పిటిషనర్ నితిన్ హుండీవాలా ప్రయత్నించాడని వాదించింది. అయితే.. జస్టిస్ భారతి రైల్వే వాదనను తోసిపుచ్చారు. ఈ ఘటన కచ్చితంగా సెక్షన్ 124(A) పరిధిలోకే వస్తుందని స్పష్టమైందని తెలిపారు. రైలులో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తే ఇతర ప్రయాణికులు తోసేసిన క్రమంలో ఫలితంగా సదరు వ్యక్తి కిందపడిపోయే ప్రమాదం ఉందని.. ఇలాంటి ఘటన రైల్వే చట్టంలోని సెక్షన్ 124(A) పరిధిలోకి ఎందుకు రాదో కారణం తెలియడం లేదని జస్టిస్ వ్యాఖ్యానించారు. పైగా ఇలాంటి ఘటనలో నష్ట పరిహారం చెల్లించకూడదని చట్టంలోని నిబంధనల్లో ఎక్కడా నొక్కి చెప్పలేదని జస్టిస్ భారతి డాంగ్రే చెప్పారు.



ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. పిటిషనర్ నితిన్ హుండీవాలా 2011లో ముంబైలో రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్‌లో నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. ఆ సమయంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై ఆయన రైల్వే నుంచి నష్టపరిహారం కోరారు. ఈ కేసులో రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ 2013 జులైలో Western Railways రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చి అతని అభ్యర్థనను తిరస్కరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుండీవాలా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా ముంబై హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. మహా నగరాల్లో ఉరుకులపరుగుల జీవనానికి అలవాటు పడిన జనం ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేందుకు సిటీ బస్సులను, లోకల్ ట్రైన్స్‌ను ఆశ్రయిస్తుంటారు. ముంబై లాంటి మహా నగరంలో అయితే లోకల్ ట్రైన్స్‌లో రద్దీ కిక్కిరిపోతుంటుంది. అంత రద్దీ సమయంలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-04-27T01:39:15+05:30 IST