తల్లిదండ్రులను వేధించిన కొడుకును ఇంటి నుంచి పొమ్మన్న హైకోర్టు

ABN , First Publish Date - 2021-09-17T21:55:12+05:30 IST

తల్లిదండ్రులను వేధించిన కొడుకుపైనా, ఆయన భార్యపైనా బోంబే

తల్లిదండ్రులను వేధించిన కొడుకును ఇంటి నుంచి పొమ్మన్న హైకోర్టు

ముంబై : తల్లిదండ్రులను వేధించిన కొడుకుపైనా, ఆయన భార్యపైనా బోంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ నెలలోగా ఆ వృద్ధ తల్లిదండ్రుల ఫ్లాట్‌ను ఖాళీ చేసి, వెళ్ళిపోవాలని ఆ కొడుకు దంపతులను ఆదేశించింది. 


ఆశిశ్ దలాల్, ఆయన భార్య కలిసి ఆశిశ్ తల్లిదండ్రుల ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆశిశ్ తండ్రి వయసు 90 సంవత్సరాలు, తల్లి వయసు 89 సంవత్సరాలు. ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఆశిశ్ ఒక్కడే సంతానం. ఆ వృద్ధులను ఆశిశ్ దంపతులు చాలా కాలం నుంచి వేధిస్తున్నట్లు కేసు నమోదైంది. 


ఏకైక కుమారుడు, కోడలి చేతుల్లో వృద్ధ తల్లిదండ్రులు బాధలను అనుభవిస్తున్నారని బోంబే హైకోర్టు గమనించింది. ఆశిశ్‌కు నవీ ముంబై, దహీసార్ ఏరియాలో మూడు ఇళ్ళు ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రుల ఫ్లాట్‌లోనే ఉంటానని పట్టుబడుతున్నట్లు గుర్తించింది. ఆశిశ్‌ను, ఆయన భార్యను వృద్ధ తల్లిదండ్రుల ఫ్లాట్ నుంచి వెళ్ళిపోవాలని తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు తమను తాము కాపాడుకోవడానికి, తమ సొంత కుమారుల వేధింపుల నుంచి రక్షించుకోవడానికి కోర్టులను ఆశ్రయించవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కూతుళ్ళు ఎప్పటికీ కూతుళ్ళేనని, కొడుకులు పెళ్ళయ్యే వరకు మాత్రమే కొడుకులని ఓ సామెత ఉందని, దీనిలో కొంత సత్యం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.  అయితే దీనికి కచ్చితంగా అసాధారణ మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. 


వృద్ధులు సాధారణ జీవితం జీవించేలా, ఎటువంటి వేధింపులకు గురి కాకుండా ఉండేలా వారి సంతానం, బంధువులు చూడాలని సీనియర్ సిటిజన్స్ యాక్ట్ చెప్తోందని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో కొడుకు తన వృద్ధ తల్లిదండ్రులు సాధారణ జీవితం జీవించకుండా ఉద్దేశపూర్వకంగా నిరోధించడం చాలా విచారకరమని తెలిపింది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం పిల్లలు, లేదా బంధువులు, సందర్భాన్నిబట్టి ఎవరైతే వారు, వృద్ధులు సాధారణ జీవితం జీవించేలా చూడాలని తెలిపింది. ఇది వారి బాధ్యత అని పేర్కొంది. 


తల్లిదండ్రుల ఫ్లాట్ నుంచి వెళ్ళిపోవాలని ఆశిశ్‌కు, ఆయన భార్యకు సీనియర్ సిటిజన్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన అపీలును హైకోర్టు విచారించింది. 


Updated Date - 2021-09-17T21:55:12+05:30 IST