బాధితురాలిని చంద్రబాబు పరామర్శిస్తే.. ప్రభుత్వం ఉలిక్కి పడింది : బోండా ఉమ

ABN , First Publish Date - 2022-04-23T17:02:47+05:30 IST

మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో 30 గంటలు నిర్భందించి...

బాధితురాలిని చంద్రబాబు పరామర్శిస్తే.. ప్రభుత్వం ఉలిక్కి పడింది  : బోండా ఉమ

విజయవాడ: మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో 30 గంటలు నిర్భందించి సామూహిక అత్యాచారం చేశారని ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యంగా భావించి ప్రజలు నివ్వెర పోయారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వెళితే ప్రభుత్వం ఉలిక్కి పడిందన్నారు. మూడు రోజుల తర్వాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను పంపారని, కూతవేటు దూరంలో ఉన్న సిఎం, హోంమంత్రికి బాధితురాలిని పరామర్శించి.. భరోసా ఇచ్చే తీరిక కూడా లేదా? అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరితే తమకు నోటీసుల ద్వారా బెదిరింపులా? అని మండిపడ్డారు. చంద్రబాబు వచ్చిన తర్వాత మంత్రులు కదిలారన్నారు. అక్కడ బాధితులు వాళ్లను నిలదీస్తే... తట్టుకోలేక పోయారని, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే పద్మ పాటిస్తున్నారని విమర్శించారు. మహిళా కమిషన్ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మహిళల హక్కుల కోసం పని చేయాల్సిన వాసిరెడ్డి పద్మ తాడేపల్లి ప్యాలెస్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని బోండా ఉమ దుయ్యబట్టారు.

Updated Date - 2022-04-23T17:02:47+05:30 IST