ఈ నెల 25లోగా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు

ABN , First Publish Date - 2020-07-13T20:31:48+05:30 IST

అంతా సవ్యంగా ఉంటే విద్యా సంస్థలు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తుండే. ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ఈ నెల 25లోగా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు

వడివడిగా మండల కేంద్రాలకు పుస్తకాల చేరవేత

ఈ నెల 20 లోపు సరఫరా చేయాలని ఆదేశం

మండలాలకు చేరిన 2,55,384 పుస్తకాలు 


సంగారెడ్డి అర్బన్‌ : అంతా సవ్యంగా ఉంటే విద్యా సంస్థలు ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తుండే. ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేవి. కానీ కరోనా మహమ్మారి విజృంభణతో విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. విద్యా శాఖ అధికారులు మాత్రం ముందస్తుగా సర్కారు బడుల విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేసేందుకు చర్యలు చేపట్టారు. 25లోగా ప్రభుత్వ బడులకు సరఫరా చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాకు చేరుకున్న పుస్తకాలను మండల కేంద్రాలకు వడివడిగా చేరవేస్తున్నారు. 


పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి వడివడిగా మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఈ నెల 20వ తేదీలోపు మండల కేంద్రాలకు, అటు నుంచి 25లోగా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరవేయాలని రాష్ట్ర విద్యా శాఖ ఆదేశించింది. ఆ మేరకు జిల్లా విద్యా శాఖ అఽధికారులు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగా నూతన విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమౌతుందనే విషయంపై స్పష్టత లేదు. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్‌ వ్యాప్తితో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాలు సిద్ధం చేసేలా విద్యాశాఖ తగిన చర్యలు చేపడుతున్నది. 


ఎనిమిది మండలలాకు చేరిన పాఠ్యపుస్తకాలు

ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాల సరఫరా ప్రారంభమైంది. జిల్లాలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన పుస్తకాలను జిల్లా కేంద్రానికి పంపించారు. సంగారెడ్డిలోని గోదాం నుంచి పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేసి పనిని ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరాయి. మిగతా అన్నీ మండలాలకు 20లోగా పాఠ్య పుస్తకాలను చేరవేస్తామని జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు దశల వారీగా పాఠపుస్తకాలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.


సంగారెడ్డి జిల్లాకు 6,71,360 పుస్తకాలు అవసరమని నివేదించగా ఇప్పటి వరకు 6,43,340 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 28,020 పుస్తకాలు రావాల్సి ఉంది. కాగా, అందులో 2,55,384 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు చేరవేశారు. నిర్ణీత గడువులోగా పాఠ్య పుస్తకాలను మండల పాయింట్లు, పాఠశాలలకు చేరవేస్తామని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-13T20:31:48+05:30 IST